NCP-Ajit Pawar | దేశ రాజకీయాల్లో తల పండిన నేత శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మంగళవారం తీర్పు చెప్పింది. ఎన్సీపీ అధికార గుర్తు ‘గడియారం’ కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.
మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్.. 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాటి లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. తిరిగి 1999 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కార్ లో చేరారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎన్సీపీ ఉంది.
2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు ఎన్సీపీ కూడా దెబ్బ తిన్నది. అదే ఏడాది చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా, సీఎం పదవి విషయమై ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే సారధ్యంలో శివసేనను చీల్చింది. తదుపరి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీని రెండుగా చీల్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ-శివసేన (షిండే) సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముంగిట ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్కు గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.