న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐకి ఇప్పటి వరకు కొనసాగిన జాతీయ పార్టీ హోదాను తొలగించింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆప్నకు జాతీయ హోదా ఇచ్చినట్టు ఈసీ వెల్లడించింది. పలు రాష్ర్టాల్లో పలు పార్టీల రాష్ట్ర హోదాను కూడా ఈసీ వెనక్కి తీసుకొన్నది. వీటిలో యూపీలో ఆరెల్డీ, మణిపూర్లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్పీ, మిజోరంలో ఎంపీసీ, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఉన్నాయి. ఈసీ తాజా నిర్ణయం తర్వాత ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఎన్పీపీ, ఆప్ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. జాతీయ హోదాపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ కాలంలో జాతీయ హోదా వచ్చిందని, ప్రజల మద్దతుతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం:కూనంనేని
సీపీఐ జాతీయ హోదాను భారత ఎన్నికల కమిషన్ తొలగించడాన్ని సవాల్ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. జాతీయ గుర్తింపు హోదాకు సంబంధించిన నిబంధనలే తప్పుగా ఉన్నాయని చెప్పారు. కేవలం ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. సీపీఐ చరిత్ర, అన్ని రాష్ర్టాల్లో ఉన్న సభ్యత్వాలు, అనుబంధ ప్రజా సంఘాల సంఖ్యను పరిగణనలోనికి తీసుకోకుండా జాతీయ హోదాను ఉపసంహరించడం అవివేక చర్యగా అభివర్ణించారు.
ఎన్నికల్లో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న ఈసీకి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన హోదాపై నిర్ణయం తీసుకునే నైతికత లేదని పేర్కొన్నారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీల వాస్తవిక బలం బయటపడుతుందని అన్నారు. సీపీఐ జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ తొలగించినంత మాత్రాన పార్టీ ఎన్నికల గుర్తు కంకి కొడవలికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. కంకి కొడవలి గుర్తు సీపీఐకే ఉంటుందని చెప్పారు. జాతీయహోదా అనేది సాంకేతిక అంశం మాత్రమేనని, దీనివల్ల దూరదర్శన్, రేడియోలో ప్రచారానికి కేటాయించే సమయంలో తేడా వస్తుంది తప్ప ఇతర ఎలాంటి నష్టం ఉండబోదని వివరించారు.