Supreme Court | మహారాష్ట్రలోని ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సోమవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు సూచించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ రాహుల్ నర్వేకర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మరింత సమయం కోరగా.. గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు గతంలో సుప్రీంకోర్టు జనవరి 31 వరకు గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పీకర్కు నోటీసు ఇచ్చారు. గత ఏడాది జూలై 2న అజిత్ పవార్ నేతృత్వంలో పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్డీయేలో చేరారు.
అజిత్ పవార్ను నిజమైన ఎన్సీపీగా పరిగణించాలంటూ ఎన్నికల కమిషన్లో అజిత్ వర్గం పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తు సైతం తమదేనని వాదించారు. అదే సమయంలో అజిత్ పవార్ వర్గం కూడా స్పీకర్కు నోటీసు ఇచ్చింది. పార్టీలో సంస్థాగత ఎన్నికలు కూడా జరగలేదని, శరద్ పవార్ నియంతృత్వ ధోరణిలో పార్టీని నడుపుతున్నారని పాటిల్ ఆరోపించారు. గత ఏడాది జూన్లో అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని పాటిల్ పేర్కొన్నారు.