కుటుంబ రాజకీయాల విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మధ్య వార్ నడుస్తోంది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీజేపీ ఎంపీ తేజస్వీకి ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఇచ్చిన కౌంటర్ను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వ విధానాల కారణంగా భారత్లో రెండు దేశాలున్నాయంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కౌంటర్ ఇస్తూ.. మోదీ రాకముందు దేశంలో నడుస్తున్న కుటుంబ రాజకీయాలతో ఉన్న ఇండియా.. రెండోది మోదీ తర్వాత ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపైనే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బీజేపీ ఎంపీ తేజస్వీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ వారసత్వ కుటుంబాల పేర్లను పేర్కొంటూ సుప్రియా బీజేపీ ఎంపీ తేజస్వీపై విరుచుకుపడ్డారు. ‘రవి సుబ్రహ్మణ్యం మీకేమవుతారు? ప్రీతమ్ ముండే, పూనమ్ మహాజన్, హీనా గవిట్, రక్షా ఖడ్సే, సుజయ్ వీకే పాటిల్. తేజస్వీ సూర్య రవి సుబ్రహ్మణ్యం మేనల్లుడు. రవి సుబ్రహ్మణ్యం బీజేపీ ఎమ్మెల్యే. రవి సుబ్రహ్మణ్యం తేజస్వీ సూర్యకు తెలుసా? మేమంతా రాజకీయ కుటుంబాల నుంచే వచ్చాం. రాజకీయ కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నా. నేను శరద్ పవార్ కూతుర్ని.. చాలా గర్వంగా చెబుతున్నాను’ అంటూ సుప్రియా సూలే బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు కౌంటర్ ఇచ్చారు.