హనుమాన్ చాలీసా పఠనం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీ పఠనం చేస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం, హిందుత్వవాదుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది.
తాజాగా.. హిందుత్వవాదులను, బీజేపీని ఇరుకునపెట్టడానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ ఎత్తుగడ వేసింది. తాము ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా, నమాజ్ చదువుతామని, అందుకు తమకు అనుమతి కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఎన్సీపీ లేఖ రాసింది.
ఎన్సీపీ నాయకురాలు ఫమీదా హసన్ ఖాన్ మాట్లాడుతూ.. ”ఢిల్లీలో లోకకల్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు నమాజ్ చేస్తా. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, నమోకార్ మంత్ర చదువుతా. ఇందుకు నాకు అనుమతి కావాలి” అంటూ ఫమీదా హసన్ డిమాండ్ చేశారు.
ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రయోజనం పొందితే… మేము కూడా ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా చదువుతామని, తమకూ అనుమతి కావాలని ఫమీదా హసన్ డిమాండ్ చేశారు.