ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన అనుచరులకు సంబంధించి మనీల్యాండరింగ్ వ్యవహారాలపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్ట్ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తూ తాము ఎవరికీ తలవంచమని, తాము విజయం సాధిస్తామని నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. అంతకుముందు బుధవారం ఉదయం మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్సీపీ నేతను ఈడీ అధికారులు ముంబైలోని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అండర్వరల్డ్ కార్యకలపాలకు సంబంధించి తాజా కేసులో ముంబైలో దాడులు చేపట్టిన అనంతరం నవాబ్ మాలిక్ను కేంద్ర దర్యాప్తు సంస్ధ అరెస్ట్ చేసింది. దావూద్ ఇబ్రహీం దివంగత సోదరి హసీనా పర్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, సలీం ఖరేషి, గ్యాంగ్స్టర్ చోటా షకీల్ బావమరిది నివాసం సహా పది ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. మాలిక్ అరెస్ట్పై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు మోదీ సర్కార్పై మండిపడ్డారు.
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. అనిల్ దేశ్ముఖ్ తర్వాత అరెస్టయిన రెండవ మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కావడం గమనార్హం. ఇక శివసేన నేత సంజయ్ రౌత్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ మాలిక్ను ఆయన ఇంటి నుంచి ఈడీ తీసుకువెళ్లిన తీరు మహారాష్ట్ర సర్కార్కు సవాల్ వంటిదని అన్నారు. తమ రాష్ట్రానికి వచ్చి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఓ మంత్రిని తీసుకువెళ్లాయని, 2024 తర్వాత మీ అందరినీ విచారిస్తామని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కాషాయ పార్టీకి ఘాటుగా ఆయన బదులిచ్చారు.
ముందస్తు సమాచారం లేకుండా నవాబ్ మాలిక్ను ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా నవాబ్ మాలిక్ను ఈడీ కార్యాలయానికి ఎలా తీసుకువెళతారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రశ్నించారు. మాలిక్ కొంతకాలంగా బీజేపీ నేతల బాగోతాలను బయటపెడుతుండటంతో కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ తీరుగా వేధిస్తోందని ఆరోపించారు. నవాబ్ మాలిక్పై ఈడీ కొరడా ఝళిపిస్తుందని కొందరు బీజేపీ నేతలు ట్వీట్ల ద్వారా ముందుగానే పసిగట్టారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. నవాబ్ మాలిక్కు ఎలాంటి నోటీసు జారీ చేయకుండా నేరుగా ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారని, ఇది మహారాష్ట్రను అవమానించడమేనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ చౌకబారు రాజకీయాలకు తెరలేపిందని దుయ్యబట్టారు.