సతారా: దేశంలోని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం సతారా జిల్లాలో పర్యటించిన ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసే వ్యూహంలో భాగంగా బీజేపీ వేసిన వలలో కొంత మంది నేతలు పడ్డారని అజిత్ పవార్ను ఉద్దేశించి అన్నారు. అసమ్మతులు దాటుకొని పార్టీని పునర్నిర్మిస్తానని ఆయన వెల్లడించారు. దేశంలో కులం, మతం పేరుతో సమాజంలో విభజన సృష్టించే కుట్రలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు లేవని… తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా పవార్ స్పష్టం చేశారు.
ఎన్సీపీ నుంచి ఐదుగురి బహిష్కరణ
ఎన్సీపీలో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే సహా ఐదుగురు నేతలను పార్టీ బహిష్కరించింది. పార్టీ పదవులతో పాటు సభ్యత్వం తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. ఆదివారం జరిగిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే హాజరయ్యారు. వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే అంతకుముందు శరద్ పవార్కు లేఖ రాశారు.
9 మందిపై అనర్హత వేటు వేయండి
షిండే-బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్తో పాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు పిటిషన్ సమర్పించింది. ఎన్సీపీ తాజాగా ప్రతిపక్ష నేతగా నియమితులైన జితేంద్ర స్పీకర్ను ఆయన నివాసంలో ఆదివారం కలిసి ఈ పిటిషన్ను అందజేశారు. మరోవైపు పార్టీతో తమకు సంబంధం ఉన్నదని పేర్కొంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఎన్సీ పీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సోమవారం నోటీసులు జారీచేశారు.