Goa | మహారాష్ట్ర మోడల్నే గోవాలోనూ అమలు చేయబోతున్నారా? శరద్ పవార్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర బుల్ శరద్ పవార్ మహారాష్ట్రలో లాగా గోవాలోనూ సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్తో చర్చించానని, గోవా ఎన్నికల్లో కలిసే గోదాలోకి దిగుదామని ఓ ప్రతిపాదన పెట్టానని స్వయంగా శరద్ పవార్ వెల్లడించారు. ‘తృణమూల్, కాంగ్రెస్లతో చర్చలు నడుస్తున్నాయి. కలిసే గోవాలో పోటీ చేద్దామని ఓ ప్రతిపాదన పెట్టాం. చర్చలు మాత్రం నడుస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఓ రూపం రాలేదు. గోవాలో మార్పు అత్యావశ్యకం. బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందే’ అని శరద్ పవార్ తేల్చి చెప్పారు.
తృణమూల్తో పొత్తు ప్రసక్తే లేదని, ఇప్పటి వరకైతే తమకు ఆ ఆలోచనే లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. గోవాలో తృణమూల్తో పొత్తు పెట్టుకునే విషయంలో తమ పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దినేశ్ గుండూరావ్ తేల్చి చెప్పారు. బీజేపీపై దుమ్మెత్తి పోయాల్సింది పోయి, మాపైనే మమతా బెనర్జీ యుద్ధానికి దిగుతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యేలను కొనడానికి మమత ప్రయత్నిస్తుంటే తాము ఎలా జట్టు కట్టాలని కాంగ్రెస్ మండిపడింది.
సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ… గోవా వేదికగా మమతా నేతృత్వంలోని తృణమూల్, సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ బద్ధ శత్రువులుగా మారిపోయారు. బీజేపీని ఓడిచాలంటే కాంగ్రెస్ తమతో కలిసి రావాల్సిందేనని, కాస్త అహాన్ని పక్కన పెట్టాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీంతో శరద్ పవార్ సూచిస్తున్న ఫార్ములాకు కాంగ్రెస్ ఏమాత్రం ఒప్పుకోకపోవచ్చు. అయితే.. బీజేపీని బూచిగా చూపి, శరద్ పవార్ కాంగ్రెస్ను ఒప్పించే సూచనలు కనిపిస్తున్నాయని ఎన్సీపీ నేతలే పేర్కొంటున్నారు.
మరోవైపు మమతా బెనర్జీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన కూడా భగ్గుమంది. బీజేపీని విమర్శించాల్సింది పోయి, కాంగ్రెస్పై పడుతోందని సామ్నా వేదికగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సీఎం మమత ప్రయత్నిస్తోందని, గోవా వేదికగా మమతా బెనర్జీ బీజేపీకి లాభం చేస్తోందని శివసేన తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ఫార్ములాకు మమత ఒప్పుకున్నా, కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? అన్నది వేచి చూడాల్సిందే.