న్యూఢిల్లీ: దేశం పేరును ఇండియా నుంచి భారత్(Bharat)గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన జీ20 సదస్సు సమయంలో.. ఇండియా నేమ్ప్లేట్ ఉన్న స్థానంలో భారత్ అని రాసిపెట్టిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతి, భారత ప్రధాని అని పలు సందర్భాల్లో వాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియా పేరును భారత్గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కూల్ పుస్తకాల్లో భారత్ అని రాయాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ప్రతిపాదన చేసింది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనల ప్రకారం స్కూల్ కరిక్యులమ్ను మార్చనున్నారు. పాఠ్యపుస్తకాల్లో ఇండియా బదులుగా భారత్ అని రాయాలని కమిటీ చైర్మెన్ సీఐ ఇజాక్ సూచన చేశారు. ప్రాచీన చరిత్రకు బదులుగా సిలబస్లో క్లాసికల్ చరిత్రను ప్రవేశపెట్టాలని సూచించారు. అన్ని సబ్జెక్టులకు చెందిన సిలబస్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే ప్యానల్ ఇచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటి వరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ తెలిపింది.
యుద్ధాల్లో హిందువులు సాధించిన విజయాలను హైలెట్ చేస్తూ పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ప్రతిపాదించినట్లు ఇజాక్ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకు తగిన రీతిలో స్కూల్ బుక్స్ను రూపొందించేందుకు ఎన్సీఈఆర్టీ ప్రయత్నాలు చేపట్టింది. సిలబస్ తయారీ కోసం ఇటీవల 19 మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రతిపాదనల గురించే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.