ముంబై : క్రూయిజ్లో రేవ్ పార్టీపై దాడులు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా ఈ కేసుకు సంబంధించి క్రూయిజ్ షిప్ కంపెనీ కార్డెలియా క్రూయిజెస్ సీఈఓకు సమన్లు జారీ చేశారు. విచారణలో పాలుపంచుకోవాలని క్రూయిజ్ లైనర్ సీఈఓను ఎన్సీబీ కోరింది. ముంబై నుంచి గోవాకు వెళుతున్న ఈ షిప్లో ప్రయాణీకుల వివరాలను కంపెనీ నుంచి ఎన్సీబీ అధికారులు రాబడుతున్నారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి దర్యాప్తునకు ఉపకరించే ఆధారాల కోసం ఎన్సీబీ షిప్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తోంది.
ఈ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా ఇప్పటివరకూ 16 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఈవెంట్ కంపెనీ ప్రతినిధులు నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రైవేట్ ఈవెంట్ కోసం ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి షిప్ను ఇచ్చామని తెలిపింది. షిప్లో జరిగిన రేవ్ పార్టీ, డ్రగ్స్ వ్యవహారంలో అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.