రాయ్పూర్, ఏప్రిల్ 16: నక్సలైట్ల జాడ గురించి కచ్చితమైన సమాచారమిచ్చిన వారికి ఛత్తీస్గఢ్ పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సరైన సమాచారం ఇచ్చిన వారికి పోలీస్ శాఖలో ఉద్యోగాలిస్తామని, రూ.5 లక్షల నగదు పారితోషికం కూడా ఇస్తామని కబీర్ధామ్ జిల్లా సీనియర్ అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్ సరిహద్దులోని జిల్లాల్లోని నక్సలైట్ ప్రభావిత గ్రామాల్లో ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేశారు. వాటిలో ‘సుచ్నా దో ఇనామ్ పావో’ (సమాచారం ఇవ్వండి, బహుమతిని అందుకోండి) అని ప్రకటించారు.
అలాగే లొంగిపోవటానికి సిద్దపడిన నక్సలైట్లకు కూడా నగదు రివార్డులను ఇస్తామని కరపత్రాల్లో పేర్కొన్నారు. కేవలం కరపత్రాలే కాకుండా ఆ ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులందరికీ వాట్సాప్ ద్వారా కూడా సందేశాన్ని పంపినట్టు కభీర్దామ్ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. తాము అందించే నగదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన బహుమతికి అదనమని ఆయన స్పష్టం చేశారు. ఇక సమాచారమిచ్చి వారికి ఎలాంటి పరీక్షలు లేకుండా పోలీసు శాఖలో కానిస్టేబుల్స్గా తీసుకుంటామని, కాకపోతే శారీరక ప్రమాణాలను మాత్రం పాటించాల్సి ఉంటుందన్నారు.