రాయ్పూర్: పోలింగ్ బృందాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఐఈడీని పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. (Jawan killed) ఛత్తీస్గఢ్లోని బింద్రానవగఢ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత బడే గోబ్రా పోలింగ్ స్టేషన్ నుంచి వాహనాల్లో తిరిగి వెళ్తున్న పోలింగ్, భద్రతా సిబ్బందిని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. రోడ్డుపై అమర్చిన ఐఈడీని పేల్చారు. ఈ సంఘటనలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జోగిందర్ సింగ్ మరణించినట్లు రాయ్పూర్ రేంజ్ ఐజీ ఆరిఫ్ షేక్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలు సురక్షితంగా గరియాబంద్కు చేరుకున్నాయని వెల్లడించారు.
మరోవైపు శుక్రవారం ఛత్తీస్గఢ్లో రెండో విడతలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 68.15 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 90 స్థానాలకుగాను ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.