న్యూఢిల్లీ: నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారని ఆయన పేర్కొన్నారు. నక్సల్స్ను రూపుమాపడంలో.. సీఆర్పీఎఫ్ వెన్నుముఖగా నిలిచినట్లు ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఇవాళ సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్కు చెందిన 86వ రైజింగ్ డే ఫంక్షన్ జరిగింది. అక్కడ అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశం నుంచి నక్సలైట్లను ఏరివేయడంలో సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) తోపాటు సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) యూనిట్.. భద్రతా దళాల్లో ప్రత్యేకంగా పనిచేస్తున్నది. గెరిల్లా, జంగిల్ యుద్ధాల్లో ఆ దళం ఆరితేరి ఉన్నది. నక్సల్స్ను ఎదుర్కోవడంలో కోబ్రా దళం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నదన్నారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసినట్లు షా వెల్లడించారు. దీని వల్లే ఈ ప్రాంతాల్లో హింస తగ్గిందన్నారు. సుమారు 70 శాతం హింస తగ్గినట్లు చెప్పారు. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ చేసిన సేవలు అసాధారణమైనవని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడటంలోనైనా, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలన్నా, నక్సలైట్లను ఎదుర్కోవాలన్నా.. సీఆర్పీఎఫ్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందన్నారు. ప్రతి అచీవ్మెంట్లో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు చెప్పారు.
సీఆర్పీఎఫ్ సాధించిన అతి గొప్ప విజయాల్లో.. నక్సలిజాన్ని పారద్రోలడమే అని తెలిపారు. కోబ్రా కమాండోల గురించి విన్నప్పుడు నక్సల్స్ వణికిపోతున్నారన్నారు. ధైర్యానికి ప్రతీకగా కోబ్రా బెటాలియన్ నిలిచిందన్నారు. 86వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా యూనిట్ జవాన్లకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు షా వెల్లడించారు. మీ నేతృత్వంలో సీఆర్పీఎఫ్ జవాన్లు .. నక్సలిజం రూపుమాపడంలో ముందుకెళ్లినట్లు చెప్పారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశం నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని షా తెలిపారు. దేశం ఈ ప్రతిజ్ఞ తీసుకున్నదని, ఇక సీఆర్పీఎప్ వెన్నుముఖగా ఉందన్నారు.
వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి 19వ తేదీన సీఆర్పీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950వ సంవత్సరంలో ఈ రోజునే కేంద్ర హోంమంత్రి వల్లభాయ్ పటేల్ జెండాను దళానికి అందజేశారు. అయితే ఈ ఏడాది సంబరాలను పొడిగించిన నేపథ్యంలో ఏప్రిల్ 17వ తేదీన పరేడ్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో 1939, జూలై 27వ తేదీన బ్రిటీష్ పాలకులు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసు శాఖను ఏర్పాటు చేశారు. దాన్నే 1949, డిసెంబర్ 28వ తేదీన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్గా హోంమంత్రి పటేల్ మార్చేశారు.