ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ కీలక నేత నవాబ్ మాలిక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉదయం ఆయన ఇంటికి వచ్చిన అధికారులు కేసు విచారణ నిమిత్తం ఆయనను తీసుకెళ్లారు.
దాదాపు ఆరు గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్టు చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత పీఎంఎల్ఏ కోర్టులో హాజరు పరిచింది. ఈ సందర్భంగా ఆయనను విచారించేందుకు ఆయనను 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది.
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా ఈడీ పరిశీలిస్తోంది. ఇబ్రహీం కస్కర్ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు వివరించారు. అయితే విచారణలో దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు మాలిక్ అరెస్ట్తో మహారాష్ట్రలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. కేంద్రం తీరుపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి.
మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎన్సీపీ నేతలతో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో సమావేశం జరగనుంది. రాజేశ్ తోపే, ఛగన్ భుజబల్, అజిత్ పవార్ సమావేశానికి పవార్ నివాసానికి చేరుకున్నారు. సమావేశం తర్వాత శరద్ పవార్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోనూ భేటీకానున్నట్లు తెలుస్తున్నది.