ముంబై : బాలీవుడ్ను ముంబై నుంచి తరిమివేసేందుకే బీజేపీ కుట్రపూరితంగా క్రూయిజ్ డ్రగ్ కేసును తెరపైకి తెచ్చిందని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబై ప్రతిష్టను మసకబార్చేందుకే కాషాయ పార్టీ డ్రగ్స్ కేసుతో కుట్రకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ఇటీవల సినీ ప్రముఖులతో నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చలు జరిపారని బాలీవుడ్ను ముంబై నుంచి దూరం చేసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని అన్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే రక్షణ కోరుతూ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారని నవాబ్ మాలిక్ ఆరోపించారు.
ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన కిరణ్ గొసావి జైలుపాలవడంతో పరిస్ధితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. డ్రగ్ కేసులో ప్రత్యక్ష సాక్షి కిరణ్ గొసావిని చీటింగ్ కేసులో పుణే పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ సిప్లో ఎన్సీబీ దాడుల అనంతరం ఆర్యన్ ఖాన్తో గొసావి సెల్ఫీ వైరల్గా మారింది. కాగా డ్రగ్స్ కేసులో నిందితులను విడిచిపెట్టేందుకు ఎన్సీబీ అధికారులు పెద్దమొత్తంలో లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెల్లవెత్తాయి.