న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలకు బాగా కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులు ఆసుపత్రులలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు, అత్యవసర మందుల రవాణాకు భారత నౌకాదళం ఇటీవల ప్రారంభించిన సముద్ర సేతు 2 మిషన్ను తీవ్రం చేసింది. మూడు నేవల్ కమాండ్ల నుంచి 9 యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది.
ఐఎన్ఎస్ తల్వార్ నౌక బహ్రెయిన్ నుంచి 27 టన్నుల చొప్పున రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను కర్ణాటకలోకి మంగళూరు పోర్టుకు బుధవారం తీసుకువచ్చినట్లు నేవీ తెలిపింది. ఐఎన్ఎస్ కోల్కతా 27 టన్నుల చొప్పున రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్ సిలిండర్లు, 47 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో కువైట్ నుంచి బువారం భారత్కు ప్రయాణమైనట్లు వెల్లడించింది. 27 టన్నులున్న ఆక్సిజన్ ట్యాంకర్లు, 1500కుపైగా ఆక్సిజన్ సిలిండర్లను ఖతార్, కువైట్ నుంచి రవాణా చేసేందుకు మరో నాలుగు యుద్ధ నౌకలు బయలుదేరాయని పేర్కొంది.
మరోవైపు ఐఎన్ఎస్ ఐరావత్ నౌక 216 టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,600 ఆక్సిజన్ సిలిండర్లు, 10,000 యాంటీజెన్ టెస్టింగ్ కిట్లు, ఏడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో సింగపూర్ నుంచి బుధవారం భారత్కు బయలు దేరిందని భారత నౌకాదళం తెలిపింది. అత్యవసర వైద్య సామాగ్రి తరలింపునకు ఐఎన్ఎస్ జలాశ్వను కూడా ఈ ప్రాంత సముద్ర జలాల్లో మోహరించినట్లు వెల్లడించింది. దక్షిణ నావల్ కమాండ్కు చెందిన ఐఎన్ఎస్ శార్దుల్, లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకొచ్చేందుకు పర్షియన్ గల్ఫ్కు మార్గమధ్యలో ఉన్నదని వివరించింది.