చెన్నై: రక్షణ దళాలకు భారీ మెషిన్ గన్స్ను శనివారం అందజేశారు. తమిళనాడులోని తిరుచిరప్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 12.7 ఎంఎం ఎం2 నాటో ప్రమాణం కలిగిన భారీ మెషిన్ గన్లను తయారు చేశారు. ఇజ్రాయెల్ నుండి బదిలీ అయిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. తొలి విడతగా 25 భారీ మెషిన్ గన్స్ను రక్షణ దళాలకు అందజేశారు. వీటిలో ఇండియన్ నేవీకి 15, మిగిలిన పది గన్స్ను ఇండియన్ కోస్ట్ గార్డ్కు అప్పగిస్తారు.
ఈ మెషిన్ గన్స్ను నౌకలపై మోహరించి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. కెమెరా, థర్మల్ ఇమేజ్తోపాటు పగలు, రాత్రి వేళల్లో లక్ష్యాలను గమనించడానికి, ట్రాక్ చేయడానికి లేజర్ రేంజ్ ఫైండర్ వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. నేవల్ ఆర్మమెంట్ డైరెక్టర్ జనరల్ కేఎస్పీ అయ్యర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల డైరెక్టర్ జనరల్, ఓఎఫ్బి సీఎస్ చైర్మన్ విశ్వకర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.