చండీగఢ్: దేశంలో చర్చనీయాంశంగా మారిన లఖీంపూర్ హింసాకాండ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ అరెస్టయ్యారు. లఖీంపూర్ వెళ్లడానికి ఇప్పటి వరకూ యూపీ ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో చండీగఢ్లోని గవర్నర్ నివాసం ఎదుట సిద్ధూ నిరసనకు దిగారు. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు కారుతో దూసుకెళ్లాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయాలని సిద్ధూ డిమాండ్ చేశారు.
అలాగే కేంద్రం తీసుకొచ్చి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సిద్ధూతోపాటు నిరసన చేస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా యూపీలో జరిగిన హింసాకాండలో మొత్తం 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పరిస్థితిని గమనించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు లఖీంపూర్ బయలుదేరారు.
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ, భూపేష్ బాఘేల్ తదితరులు లఖీంపూర్ వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వీరందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరికీ ప్రభుత్వం అనుమతి లేదని చెప్పారు. ప్రియాంకా గాంధీని హౌస్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.