చండీఘఢ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు గుప్పించారు. భగవంత్ మాన్ నిజాయితీపరుడని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మాఫియా రాజ్ మూలంగానే ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే సమూల ప్రక్షాళన అవసరమని స్పష్టం చేశారు.
నైతిక విలువలతో కూడిన నిజాయితీపరులను పార్టీ ముందువరసలోకి తీసుకురావాలని అన్నారు. పంజాబ్లో ఉనికి కోసం తాము పోరాడుతున్నామని సిద్ధూ వ్యాఖ్యానించిన వీడియోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఐదేండ్ల మాఫియా రాజ్ పాలనతోనే కాంగ్రస్ పార్టీ పరాజయం పాలైందని స్పష్టం చేశారు.
భగవంత్ మాన్ తన తమ్ముడు లాంటి వాడని మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే తాను పంజాబ్ సీఎంకు మద్దతిస్తానని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించడంతో సీఎంగా భగవంత్ మాన్ పాలనా పగ్గాలు చేపట్టారు.