చండీఘఢ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్ కోతల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సర్కార్ నిర్వాకమే కారణమని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఆరోపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు నూతన చట్టాన్ని తీసుకురావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని వరుస ట్వీట్లలో సిద్ధూ సూచించారు.
మనం సరైన దిశలో చర్యలు చేపడితే పంజాబ్లో కరెంటు కోతలు విధించాల్సిన అవసరం లేదని, ఏసీల వాడకాన్ని నియంత్రించాల్సిన పనిలేదని సిద్ధూ పేర్కొన్నారు. గతంలో బాదల్ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం పంజాబ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మూడు ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్పై ఆధారపడి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తోందని తెలిపారు.