చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వానికి మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాలు, హత్యాకాండ ఘటనలపై రిపోర్టులను సీఎం చన్నీ ప్రభుత్వం బహిరంగపరచకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. మోగాలోని బాఘ పురానాలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ప్రసంగించిన సిద్ధూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కాగా, సొంత పార్టీ, పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్ధూ విమర్శలు చేయడం కొత్త కాదు. అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. సిద్ధూను పీసీసీ చీఫ్గా చేయడంతో ఆగ్రహించిన అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీని వీడారు.
అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీ సీఎం కాగా, ఆయనపైనా సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే సీఎం చన్నీతోపాటు పార్టీ నేతలు బుజ్జగించడంతో చిరకు తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు సిద్ధూ ఇటీవల ప్రకటించారు.