చైనా, పాకిస్తాన్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా సరైనవి కావని స్పష్టం చేశారు. చైనా, పాక్లు ఇప్పుడు కాదు.. 1960 నుంచే మిత్రత్వంగా మెలుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ తిప్పికొట్టలేదని, ఇది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని నట్వర్ సింగ్ పేర్కొన్నారు.
రాహుల్ ముత్తాత కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లిన సందర్భం నుంచే పాక్, చైనాలు దగ్గరగా వుంటూ వస్తున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచ యవనికపై ఒంటరి కాలేదని, పొరుగు దేశాలతో చాలా సత్సంబంధాలనే నెరుపుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఉత్తమమైనదని, విఫలం కాలేదని తేల్చి చెప్పార. విదేశాంగ విధానంతోనే జీవితాంతం మసులుకున్న వ్యక్తే ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, భారత విదేశాంగ విధానం విఫలం కాలేదని నట్వర్ సింగ్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. మోదీ ప్రభుత్వం పదే పదే అంటున్న మేకిన్ ఇండియా సాధ్యమయ్యే పని కాదని, ఎందుకంటే జీఎస్టీ, నోట్ల రద్దు ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నడ్డి విరిచేశారని దుయ్యబట్టారు. వీటికి మద్దతివ్వకుండా మేకిన్ ఇండియా అనేది సాధ్యమయ్యే విషయమే కాదని తేల్చి చెప్పారు. దేశంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉద్యోగాలను కోల్పోతున్నారని, 50 ఏళ్లతో పోలిస్తే, ఇప్పుడే నిరుద్యోగ సమస్య తీవ్రమైందని రాహుల్ మండిపడ్డారు. చైనా పాకిస్తాన్ను వేరుచేయాలన్నది భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని రాహుల్ మండిపడ్డారు.