న్యూఢిల్లీ, జూలై 16 : రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్ని ఉద్దేశిస్తూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ‘మీరు భారత ప్రధాని అయినా, చైనా అధ్యక్షుడు అయినా లేక బ్రెజిల్ అధ్యక్షుడు అయినా.. రష్యాతో వాణిజ్యం ఇంకా కొనసాగిస్తూ వారి చమురు, గ్యాస్ని కొనుగోలు చేస్తుంటే మీపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తాను’ అంటూ రూట్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిన నేపథ్యంలో నాటో ప్రధాన కార్యదర్శి నుంచి ఈ హెచ్చరికలు జారీకావడం గమనార్హం. ఈ మూడు దేశాల నాయకులు శాంతి చర్చలపై దృష్టి కేంద్రీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.
తాను చేస్తున్న హెచ్చరికను ఈ మూడు దేశాల నాయకులు పరిగణనలోకి తీసుకోని పక్షంలో తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన హెచ్చరించారు. శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలని పుతిన్ని ప్రత్యక్షంగా పిలుపునివ్వాలని మూడు దేశాల నాయకులను ఆయన కోరారు. శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని పుతిన్కి ఫోన్ చేసి నేరుగా చెప్పాలని ఆయన తెలిపారు. అలా చేయకపోతే భారత్, బ్రెజిల్, చైనా భారీస్థాయిలో దెబ్బ తింటాయని ఆయన చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఇటీవలే ప్రకటించారు. అంతేగాక ఉక్రెయిన్తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.