హైదరాబాద్: శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతశ్రేణిలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను పరిచయం చేయనుందని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో రైతుల ఆదాయం వృద్ధి చేయడంతో పాటుగా తమ పంటను ఎగుమతి చేయడంలోనూ సహాయపడనుందని, రైతులతో పాటు,సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శాస్త్రీయ సమాజాన్ని , వ్యవసాయ రంగ నిపుణులను ఈ కార్యక్రమానికి తగిన ప్రణాళికను సూచించాల్సిందిగా కోరిందని, తద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం మద్దతునందిస్తుందని వినోద్ తెలిపారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత, ఈ పంటల వైవిధ్యీకరణ కార్యక్రమంతో రైతులకు ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటుగా పంట దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఉత్పత్తి చేయడం వల్ల వారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఇటీవల నగరంలోని ఓ హోటల్లో తెలంగాణాలో వ్యవసాయ వస్తువుల ఎగుమతి’ అంశంపై జరిగిన జాతీయ వర్క్షాప్లో పాల్గొన్న కుమార్ ఈ అంశాలను వెల్లడించారు. ఈ వర్క్షాప్ను తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎన్జీఓ ఆఫ్ రూరల్ ఇండియా (సీఎన్ఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించగా, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ మద్దతునందించింది.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం నియంత్రిత వ్యవసాయ విధానం అవసరం’’ అని అభిప్రాయపడ్డారు.
అత్యవసరంగా శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్స్, కమోడిటీ నిపుణులతో చర్చించి దీనికి సంబంధించి ఓ ప్రణాళికను తీసుకురావాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కారణంగా రైతులు నష్టపోతున్నారని, అత్యుత్తమ ఇన్పుట్స్, ట్రేసబిలిటీతో ఈ నష్టాలను తగ్గించవచ్చని ధనుకా గ్రూప్ ఛైర్మన్ ఆర్.జి. అగర్వాల్ పేర్కొన్నారు.