న్యూఢిల్లీ, నవంబర్ 9: వైద్యవిద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) నిర్వహించనున్నారని వెల్లడించారు. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి నెక్ట్స్ 2023 డిసెంబర్లో నిర్వహించనున్నారు. 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు నెక్ట్స్ రాసే మొదటి బ్యాచ్ అవుతారు.
త్రీ ఇన్ వన్
నీట్-పీజీ పరీక్ష పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మాత్రమే నిర్వహిస్తుండగా, నెక్ట్స్లో మూడు అంశాలను చేర్చారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు నెక్ట్స్ పాసైతే పీజీలో సీటు పొందవచ్చు. ఉన్నత విద్య చదవకపోయినా వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు కూడా ఈ పరీక్షే లైసెన్సుగా ఉపయోగపడుతుంది. వీటితోపాటు విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు నెక్ట్స్ పాసైతే మనదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు, పీజీ చేసేందుకు కూడా అనుమతి లభిస్తుంది. విదేశీ విద్యార్థులకు ఇప్పటివరకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.