న్యూఢిల్లీ, ఆగస్టు 7: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) 2028 నుంచి అమల్లోకి వస్తుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా వెల్లడించింది. 2023-24 ఎంబీబీఎస్ బ్యాచ్తో ఈ కొత్త విధానం మొదలవుతుందని పేర్కొన్నది. నెక్స్ స్టెప్-1 పరీక్షలు 2028 ఫిబ్రవరిలో, స్టెప్ 2 పరీక్షలు 2029 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ ఇయర్ను సోమవారం విడుదల చేసింది. మనదేశంలో వైద్య విద్య పూర్తిచేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణత సాధించాలంటే, మెడికల్ లైసెన్స్ పొందాలంటే ఇక నుంచి ‘నెక్స్’ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అంతేగాక పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో నెక్స్ మెరిట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు. 2020 ఎంబీబీఎస్ బ్యాచ్కు ‘నెక్స్’ నిర్వహిస్తామని కేంద్రం తొలుత ప్రకటించింది. నెక్స్ మాక్ టెస్ట్ జూలై 28న ఉంటుందని ఎయిమ్స్ ఢిల్లీ సైతం ఓ ప్రకటన చేసింది. అయితే దీనిని రద్దు చేశామని, 2023-24 ఎంబీబీఎస్ బ్యాచ్తో నెక్స్ ఉంటుందని ఎన్ఎంసీ తాజా ప్రకటనలో పేర్కొన్నది. ‘నీట్’తో పోల్చితే.. ‘నెక్స్’ పరీక్షలు అంత కఠినంగా ఉండవని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవ్య కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో చెప్పారు.