ముంబై, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామంటూ కోట్ల రూపాయలతో ప్రకటనలు గుప్పిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. విద్యావిధానంలో మాత్రం దారుణంగా వెనుకబడింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ రాష్ట్రంలో అమలు చేయాల్సిన నూతన జాతీయ విద్యావిధానం కేవలం కాగితాలకే పరిమితమైనట్టు కేంద్ర విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని మొత్తం 65,639 ప్రభుత్వ పాఠశాలలకు గాను కేవలం 18,540 స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం, 4,867 పాఠశాలల్లో మాత్రమే స్మార్ట్క్లాస్ రూం సౌకర్యం ఉన్నది.
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న పాఠశాలల్లో కేవలం 5.5 శాతం స్కూళ్లలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి. విద్యా బోధనకు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్న పాఠశాలలు 36,493 మాత్రమే. సగం కంటే ఎక్కువ పాఠశాలల్లో కంప్యూటర్లను వినియోగించడం లేదు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 50,468 స్కూళ్లు తాత్కాలిక విద్యుత్తు కనెక్షన్లతోనే నెట్టుకొస్తుండగా.. 5,104 పాఠశాలలకు అసలు విద్యుత్తు కనెక్షన్లే లేవు. దీంతో డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్ చాట్బాట్ ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేయాలన్న ఆదేశాలను ఎలా అమలు చేయాలో తెలియక ఆయా పాఠశాలల విద్యా కమిటీలు తలపట్టుకుంటున్నాయి.