Tikaits on UP Elections | సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయిత్ యూ-టర్న్ తీసుకున్నారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ- రాష్ట్రీయ లోక్దళ్ (ఎస్పీ-ఆర్ఎల్డీ) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి మద్దతు ప్రకటించడంపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై కిసాన్ సంయుక్త్ మోర్చా సుప్రీం అని పేర్కొన్నారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతారా? అంటే తన వద్దకు ఏ పార్టీ అభ్యర్థైనా రావచ్చునని నరేశ్ తికాయిత్ వ్యాఖ్యానించారు. కానీ, తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనన్నారు. బీజేపీ అభ్యర్థులు తమకు శత్రువులు కాదన్నారు. ఎవరైనా తనను కలిసి ఆశీర్వాదం తీసుకోవచ్చు గానీ, మద్దతు కోరొద్దని చెప్పుకొచ్చారు.
మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ నగర సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన అన్నదాతల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు రాకేశ్ తికాయిత్.. నరేశ్ తికాయిత్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సదరు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ముజఫర్నగర్లోని సిసౌలీలో జరిగిన సభలో నరేశ్ తికాయిత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధానా నుంచి రాజ్పాల్బాలియన్, మీరాపూర్ నుంచి చందన్ చౌహాన్, షామ్లీలోని థానా భవన్ నుంచి అశ్రఫ్ అలీలను ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి బరిలో నిలిచింది. గత నెలలో లఖింపూర్ ఖేరీలో రైతుల మీదుగా కాన్వాయ్ నడిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ కేసులో కేంద్ర క్యాబినెట్ నుంచి అజయ్ మిశ్రాను తప్పించాలని కోరుతూ 21 తర్వాత లఖింపూర్ ఖేరీలో 3,4 రోజులు పర్యటిస్తానని రాకేశ్ తికాయిత్ చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి 40కి పైగా రైతు సంఘాల, అసోసియేషన్ల కూటమి సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సారధ్యం వహించింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎటువంటి పురోగతి లేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేయలేదు. హర్యానాలోని రైతులపై నమోదైన కేసులు మాత్రమే ఉపసంహరిస్తున్నారు. ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల్లో రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణపై చెప్పుకోదగిన ప్రగతి లేదు. విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇవ్వాలన్న డిమాండ్పైనా చర్చ లేదని ఎస్కేఎం నేత యుధ్వీర్ సింగ్ మీడియాతో అన్నారు.