డెహ్రాడూన్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో శనివారం రూ 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. రూ 8300 కోట్లతో చేపడుతున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ సహా పలు ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని పరిశీలించారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు.
రూ 18,000 కోట్లతో తలపెట్టిన ప్రాజెక్టులు తదుపరి దశాబ్ధం ఉత్తరాఖండ్దేనని చాటిచెబుతాయని అన్నారు. గత ఐదేండ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ లక్ష కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే రెండు నగరాల మధ్య దూరం 248 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్లకు తగ్గుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో కొత్తగా మరో మూడు వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.