ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అన్నారు. పార్టీ హైకమాండ్కు ఈ విషయం నివేదించానని ఆయన చెప్పుకొచ్చారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన ఆపై ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ను ఏర్పాటు చేసింది.
గత రెండున్నరేండ్లుగా మహారాష్ట్రలో తమ పార్టీని ఎన్సీపీ బలహీనపరుస్తోందని నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ నానా పటోలె వ్యాఖ్యానించారు. జడ్పీ, ఇతర స్ధానిక సంస్ధలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.
గొందియా జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎన్సీపీ బీజేపీతో చేతులు కలిపిందని అన్నారు. భివాండి-నిజాంపూర మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్సీపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఉదయ్పూర్లో ఇటీవల ముగిసిన పార్టీ చింతన శిబిరంలో ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ ఆగస్ట్, సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని నానా పటోలె తెలిపారు. రాహుల్ గాంధీని తమ నేతగా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు.