షిల్లాంగ్: మూడు ఈశాన్య రాష్ర్టాల శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. మేఘాలయాలో సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అత్యధికంగా 26 స్థానాల్లో గెలిచి మెజారిటీకి కొద్దిదూరంలో ఆగిపోయింది. యూడీపీ 11 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, ఇతరులు 17 స్థానాల్లో గెలుపొందారు. నాగాలాండ్లో ఈశాన్య ప్రజాస్వామ్యిక కూటమి 37 స్థానాల్లో విజయం సాధించి మెజార్టీ సాధించింది. త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి 32 స్థానాల్లో గెలుపొందింది. తిప్ర మోత పార్టీ 20 శాతం ఓట్లతో 13 స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది.
60 ఏండ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా హెకానీ జఖాలు చరిత్ర సృష్టించారు. తర్వాత సల్హౌతునొ క్రుసె కూడా విజయం సాధించారు.