ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీరెన్ నేతృత్వంలోని బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో.. బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఆయననే సభానాయకుడిగా ఎంపికయ్యారు. మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది రెండవసారి. సీఎం బీరెన్ సింగ్తో పాటు మరో అయిదుగురు ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీరెన్ క్యాబినెట్లో నెమ్చా కిప్జెన్, వై కేమ్చాంద్ సింగ్, బిశ్వజిత్ సింగ్, అవాంగ్బో నెవ్మాయి, గోవిందదాస్ కొంతుజంలు మంత్రులుగా చేరారు.
హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్చంద్ర సింగ్పై 18 వేల ఓట్లతో బీరెన్ సింగ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఐదోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 2016 అక్టోబర్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్పై తిరుగుబాటు చేసిన బీరెన్ సింగ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.