Mizoram | ఐజ్వాల్ : మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడి తమ దేశ సైనికులను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య అంతర్యుద్ధం జరగుతున్నది. దీంతో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరానికి(Mizoram) వస్తున్నారు. ఇలా గతవారం దేశంలోకి చొరబడిన 276 మంది సైనికుల్లో 184 మందిని తిరిగి మయన్మార్కు పంపినట్లు అస్సామ్ రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన అధికారులు వెల్లడించారు. మిగిలిన 92 మందిని నేడు పంపనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 635 మంది మయన్మార్ సైనికులు భారత్లోకి చొరబడ్డారు.