జైపూర్, జూన్ 26: ‘నా డ్యూటీ టైం ముగిసింది. ఇక నేను విమానాన్ని నడపను’ అంటూ అంతర్జాతీయ విమాన పైలట్ ఒకరు అర్ధాంతరంగా విధుల నుంచి తప్పుకోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ఆరు గంటల పాటు మరో పైలట్ కోసం నిరీక్షించినా ప్రయోజనం లేకపోవడంతో క్యాబ్లు, బస్ల ద్వారా గమ్యానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవం ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు ఎదురైంది. లండన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏ1-112 సోమవారం ఉదయం 6గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది.
వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని జైపూర్కు మళ్లించారు. కొద్దిసేపటి తర్వాత ఫ్లయిట్ అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతుందని ప్రయాణికులు ఆశించారు. అక్కడితో తన డ్యూటీ సమ యం అయిపోయిందంటూ పైలట్ దిగిపోయాడు. దీంతో విమానాన్ని నడిపే నాథుడు లేకపోవడంతో ప్రయాణికులు 6 గంటల పాటు అగచాట్లుపడ్డారు. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ గా, కొందరు ప్రయాణికులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన ఎయిర్ ఇండియా ప్రయాణికులను క్యాబ్లు, వోల్వో బస్సు ద్వారా ఢిల్లీకి పంపింది. ప్రయాణికులకు అవసరమైన ఆహారం, ఇతర సదుపాయాలను సమకూర్చినట్టు అధికారులు తెలిపారు.