Himantha Biswa Sharma | అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. అసోంలో ముస్లింల జనాభా 35 శాతానికి చేరుకుందని వ్యాఖ్యానించారు. కనుక తమ రాష్ట్రంలో ముస్లింలను మైనారిటీలుగా ఎంతమాత్రమూ పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. 1990ల్లో కశ్మీరీ పండిట్ల వలసలను గుర్తు చేశారు. కనుక ఇతర సామాజిక వర్గాల్లో భయాందోళనను తగ్గించాల్సిన బాధ్యత ముస్లింలదేనని చెప్పారు.
బుధవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొంటూ .. ఈ రోజు ముస్లిం సామాజిక వర్గ నేతలు విపక్షంలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు సమాన అవకాశాలు ఉంటాయి. అధికారాలు ఉపయోగించొచ్చు. గిరిజన ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. వారి భూములను ఆక్రమించుకోవద్దు. 6వ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించుకోవద్దన్నారు. బొరా, కలిటా సామాజిక వర్గాల వారు తమ భూముల్లో స్థిర పడలేదన్నారు. కనుక ఆ భూముల్లో స్థిర పడిన ముస్లింలు తప్పుకోవాలన్నారు.
35 శాతంగా ఉన్న ముస్లింలు రాష్ట్రంలోని మైనారిటీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అధికారంతోపాటు బాధ్యతలు కూడా వస్తాయన్నారు. అసోమీ ప్రజలు భయంతో బతుకుతున్నారని, నాగరికత, సంస్కృతిని కాపాడతారా? లేదా అన్న భయం ఉందన్నారు. సామరస్యం అన్నది టూ వే ట్రాఫిక్ అని పేర్కొన్నారు.