బెంగళూరు: దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు ఏదో ఒక రోజు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కలుస్తారని కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలపై గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరీ, ‘మా ఆర్ఎస్ఎస్’ అనే పదాన్ని ఉపయోగించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ‘మన ఆర్ఎస్ఎస్’ అనే రోజు వస్తుందన్నారు. ‘ఇది మా ఆర్ఎస్ఎస్, నా ఆర్ఎస్ఎస్. మీరు (ప్రతిపక్షం) కూడా రానున్న రోజుల్లో మన ఆర్ఎస్ఎస్ అని అంటారు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మండిపడ్డారు. క్రైస్తవులు, ముస్లింలు ఆర్ఎస్ఎస్ అంటారని చెప్పడానికి మీరెవరు? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేజే జార్జ్ ప్రశ్నించారు. అయితే తాను ఎప్పటికీ ఆర్ఎస్ఎస్లో కలవబోనని, ఆ పేరు కూడా చెప్పబోనని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కాగా, అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్పై చర్చకు ఆయన చేసిన వ్యాఖ్యలే దారి తీశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కొంత మంది నేతలు, మంత్రులతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయని సిద్ధరామయ్య తెలిపారు. ‘వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యం. ఆ తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల వంటి వ్యత్యాసాలు’ అని అన్నారు.
స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే దీనిపై స్పందించారు. ‘మా ఆర్ఎస్ఎస్’ను మీరెందుకు ఇబ్బందిగా భావిస్తున్నారు? అని నవ్వుతూ ప్రశ్నించారు. అయితే మనసులో ఎలాంటి భావాలు లేకుండా తాను మాట్లాడుతున్నానని సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు స్పీకర్ కుర్చీలో కూర్చొని ‘మా ఆర్ఎస్ఎస్’ అని విశ్వేశ్వర్ హెగ్డే అనడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ నిలదీశారు. దీంతో ‘మా ఆర్ఎస్ఎస్ కాకపోతే మరేమిటి? తప్పకుండా మా ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ మాదే’ అని స్పీకర్ చెప్పారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ‘మా ఆర్ఎస్ఎస్’ అని మీరు కూడా తప్పక అంటారు’ అని జమీర్ నుద్దేశించి అన్నారు.
స్పీకర్ వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు. అలాంటి రోజు ఎప్పుడూ కూడా రాదని అన్నారు. ‘మా ఆర్ఎస్ఎస్’ అని తాము ఎప్పుడూ కూడా అనబోమని అన్నారు. తాను కూడా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకమని సిద్ధరామయ్య తెలిపారు.
దీంతో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అంతటా ఉన్నదని, సర్వవ్యాప్తి అయ్యిందని చెప్పారు. మన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు ముఖ్యమంత్రులు కూడా ఆర్ఎస్ఎస్కు చెందినవారేనని అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలని, ఇది మన అదృష్టమని వ్యాఖ్యానించారు. అయితే దేశానికి దురదృష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిగా అన్నారు.
ఇంతలో మంత్రి ఈశ్వరప్ప జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ముస్లింలు, క్రైస్తవులంతా ఆర్ఎస్ఎస్లో భాగమవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు.
దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే స్పీకర్పై మండిపడ్డారు. గత ఏడాది రాజ్యాంగం విలువలపై చర్చ సందర్భంగా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం కోసమే ఉన్నానని అప్పుడు అన్న మీరు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు మద్దతుగా మాట్లాడం సరికాదని విమర్శించారు. గతంలో మనుస్మృతి కోసం నిరసనలు చేసిన ఆర్ఎస్ఎస్, రామ్లల్లా మైదానంలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిందని ఆరోపించారు. దీంతో తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దంటూ స్పీకర్, బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ‘ఇది సరి కాదు.. రాజకీయాలు చేయాలనుకుంటే బయట చేయండి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖర్గే నుద్దేశించి స్పీకర్ అన్నారు.