వారణాసి కలెక్టర్కు సుప్రీంకోర్టు ఆదేశం
ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చని వెల్లడి
న్యూఢిల్లీ, మే 17: జ్ఞాన్వాపీ కాంప్లెక్స్ పరిధిలో శివలింగాన్ని గుర్తించినట్టుగా చెబుతున్న ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఇదే సమయంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని సూచించింది. అయితే జ్ఞాన్వాపీ కేసులో స్థానిక సివిల్ కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను తోసిపుచ్చింది.
హిందూ పిటిషన్దారులకు నోటీసులు జారీచేసిన న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు జ్ఞాన్వాపీ సర్వే అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను వారణాసి కోర్టు తొలగించింది. మీడియాకు లీకులు ఇచ్చినందుకు ఆయనను ప్యానెల్ నుంచి పక్కన పెట్టింది. సర్వేపై నివేదిక ఇచ్చేందుకు కమిషన్కు కోర్టు మరో రెండు రోజుల గడువు ఇచ్చింది.