అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఒక గ్రామంలోని ముస్లిం ప్రజలు బహిష్కరించారు. సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్లో ఆ మతానికి చెందిన వారు ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేదు. గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 3న ఉంధేలా గ్రామంలోని మసీదు సమీపంలో ఉన్న ఆలయం వద్ద నవరాత్రుల సందర్భంగా గర్బా వేడుక నిర్వహించారు. దీనిపై స్థానిక ముస్లిం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 150 మంది వ్యక్తులు ఆ కార్యక్రమంపై రాళ్లు విసిరారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు ముస్లిం యువకులపై లాఠీ చార్జ్ చేశారు. రాళ్లు రువ్విన సంఘటనకు సంబంధించి 43 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్ చేశారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలు చూస్తుండగా ముస్లిం యువకుల చేతులను స్తంభానికి లాగి పట్టుకుని లాఠీలతో కొట్టి శిక్షించారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల చర్యపై విమర్శలు వెల్లువెత్తడంతో దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన ఉంధేలా గ్రామంలోని ముస్లిం ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను వారు బహిష్కరించారు. సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్లో ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేదు.