లక్నో: సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ సంస్కృత శిక్షా పరిషత్ నిర్వహించిన ఉత్తర్ మాధ్యమ-2(12వ తరగతి) పరీక్షకు హాజరయ్యాడు.
13,738 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. బుధవారం వెలువడిన పరీక్ష ఫలితాల్లో ఇర్ఫాన్ ఏకంగా 82.17 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఎక్కువ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థుల్లో ఇర్ఫాన్ ఒక్కడే ముస్లిం కావడం గమనార్హం. ఇర్ఫాన్కు మొదటి నుంచి సంస్కృతం పట్ల ఆసక్తి ఉందని, అది గుర్తించి ప్రోత్సహించినట్టు తండ్రి సలావుద్దిన్ తెలిపారు.