పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పు
చండీగఢ్, జూన్ 20: ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జస్జిత్ జింగ్ బేడీ ఇస్లామిక్ షరియా రూల్ను ఉటంకించారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చేసుకునేందుకు అమ్మాయికి 16, అబ్బాయి 21 ఏండ్ల వయసు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.
21 ఏండ్ల అబ్బాయి, 16 ఏండ్ల అమ్మాయి ఇటీవల పెండ్లి చేసుకున్నారు. తమ కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆ జంట హైకోర్టును ఆశ్రయించింది. వారి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెండ్లి చేసుకున్నంత మాత్రాన, పిటిషనర్లకు రాజ్యాంగ ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరించలేరని స్పష్టం చేసింది. పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సి ఉన్నందున ఈ విషయంలో కండ్లు మూసుకొని ఉండలేమని పేర్కొన్న కోర్టు, పిటిషనర్లకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.