Murder : ఉత్తరప్రదేశ్లో 15 ఏళ్ల బాలుడు 50 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చాడు. తరచూ తనను బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతుంటడంతోనే తాను హత్యకు పూనుకోవాల్సి వచ్చిందని పోలీసులు విచారణలో బాలుడు వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడిపై కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తన ఫోన్లో వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను చూపి బెదిరిస్తూ తరచూ బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో గత సోమవారం కూడా అతడు బాలుడిని తన ఇంటికి పిలిచాడు. బాలుడు రానని చెప్పడంతో వీడియో బయటపెడతానని బెదరించాడు. దాంతో ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలని భావించిన నిందితుడు.. తన వెంట ఓ పదునైన కత్తిని తీసుకుని వెళ్లాడు. అతడు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగానే కత్తితో మెడకోసి చంపేశాడు.
గత సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. బాలుడే హత్యచేసి ఉంటాడని అనుమానించి శనివారం అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కు తరలించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం హతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.