Murder : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత విష్ణు గౌలి (58) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ముంబైలోని ఖందేశ్వర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. విష్ణు గౌలి తన కుటుంబంతో కలిసి ఖందేశ్వర్ కాలనీలోని సిద్ధివినాయక్ బిల్డింగ్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య అశ్విని (37), డ్రైవర్ సమీర్ థాకరే (26) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం విష్ణు గౌలి కంటపడటంతో భార్యను మందలించాడు. ఇద్దరు కలుసుకోకుండా డ్రైవర్ను ఉద్యోగంలో నుంచి తొలగించాడు.
దాంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న విష్ణు గౌలిని హత్య చేయాలని అశ్విని, సమీర్ పథకం వేశారు. పథకం ప్రకారం గత శుక్రవారం తన ప్రియుడు సమీర్ను ఇంటికి పిలిపించుకున్న అశ్విని.. అతడితో కలిసి భర్తను హత్యచేసింది. కాగా, విష్ణు గౌలి బాలాసాహెబ్ థాకరే అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. ఆయన చాలాకాలంపాటు వీర్ సావర్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేశారు.