ఇంఫాల్, సెప్టెంబర్ 26: మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైరల్ అవుతున్న రెండు ఫొటోల్లో ఒకదానిలో మిస్సయిన ఇద్దరు విద్యార్థులను అటవీ ప్రాంతంలో బంధించి, వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు నిలబడి ఉండగా, మరో ఫొటోలో వారిని హత్య చేసిన అనంతరం మృతదేహాలను చెట్ల మధ్య పొదల్లో పడవేసినట్టు కనిపిస్తున్నది. ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తెలుస్తున్నది.
అదృశ్యమై నెలలు గడిచినా..
17 ఏండ్ల హిజమ్ లింతో ఇంగంబి, 20 ఏండ్ల పిజమ్ హెమ్జిత్ జూలై 6 నుంచి కనిపించకుండా పోయారు. బిష్ణుపూర్, చురాచంద్పూర్ జిల్లాల మధ్య వీరిని కిడ్నాప్ చేసినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తున్నదని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. చురాచంద్పూర్ జిల్లాలోని లంబన్ సమీపంలో ఇద్దరి సెల్ఫోన్లు చివరిసారిగా ట్రేస్ అయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు మిస్సయి నెలలు గడిచినా, పోలీసులు ఈ కేసును ఇప్పటి వరకు చేధించలేదు.
ఇంఫాల్లో విద్యార్థుల భారీ ర్యాలీ
విద్యార్థుల మృతదేహాల ఫొటోలు బయటకు రావడంతో రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు రేగాయి. ఇంఫాల్లో వందలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. 45 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
శుక్రవారం వరకు బడులకు సెలవులు
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మళ్లీ మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1(ఆదివారం) వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిషేధం ఎత్తేసిన కొద్ది రోజులకే మళ్లీ ఇంటర్నెట్ను నిలిపివేయడం గమనార్హం. ఘర్షణల నేపథ్యంలో దాదాపు గత ఐదు నెలలుగా రాష్ట్రంలో కొనసాగిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఇటీవల పునరుద్ధరించిన విషయం తెలిసిందే. మరోవైపు తాజా పరిస్థితులతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.