Today History: భారతదేశం ఆర్థిక రాజధానిపై దెబ్బకొట్టేందుకు పూనుకున్న ఉగ్రవాదులు.. 1993 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని 12 ప్రాంతాల్లో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 257 మంది అసువులు బాయగా.. 700 కు పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన 22 ఏండ్లకు ప్రధాన నిందితుడైన యాకూబ్ మెనన్ను ఉరితీశారు. మరో ప్రధాన నిందితుడైన అబూ బకర్ 29 ఏండ్ల పాటు కొనసాగించిన వేటలో యూఏఈలో పట్టుబడ్డాడు.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 28 అంతస్తుల భవనంలోని బేస్మెంట్లో మధ్యాహ్నం 1:30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో దాదాపు 50 మంది మరణించారు. అర గంట తర్వాత సమీపంలోనే మరో కారు పేలుడు సంభవించింది. ఇది జరిగిన రెండు గంటలలోపు మొత్తం 12 పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోగా.. 700 కు పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు రూ.27 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.
ఈ కేసులో నవంబర్ 4 న 189 మంది నిందితులపై 10,000 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును 1993 నవంబర్ 19 న సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణ 1995 ఏప్రిల్ 19 న ముంబైలోని టాడా కోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో 123 మంది నిందితులు ఉండగా, వారిలో 12 మందికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. 68 మందికి జీవిత ఖైదు కంటే తక్కువ శిక్ష విధించింది. 23 మంది నిర్దోషులని కోర్టు తేల్చింది. యాకూబ్ మెమన్ మినహా మిగిలిన వారందరికీ ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా సుప్రీంకోర్టు మార్చింది. కాగా, 2015 లో యాకూబ్ మెమన్ను ఉరితీశారు. ఈ కేసులో టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహీం ఇంకా పరారీలోనే ఉన్నారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..