ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఉద్యోగులతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల్లో 2,300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, 35 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నింబంధనలు పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 9,813కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 1,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 17 మంది మరణించారు. మరో 918 కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క ముంబై నగరంలోనే నిన్న 922 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 141కి చేరగా, నిన్న ఒక్కరోజే కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.