ముంబై: ఏడాది వయసున్న పాప కిడ్నాప్ అయ్యింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. పాప ఆచూకీని కనిపెట్టి కిడ్నాపర్ల నుంచి రక్షించి స్వాధీనం చేసుకున్నారు. తల్లికి ఆ చిన్నారిని అప్పగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శాంతాక్రజ్ ప్రాంతంలో రోడ్డు పక్కన తల్లితోపాటు నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలికను ఒక మహిళ అపహరించింది. పాప కనిపించకపోవడంతో ఆ చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించింది.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. పాపను కిడ్నాప్ చేసిన మహిళ, మరో వ్యక్తి రైలులో సోలాపూర్ వెళ్లినట్లు గ్రహించారు. సోలాపూర్ రైల్వే స్టేషన్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ మహిళ నుంచి పాపను స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. ఆ చిన్నారి కిడ్నాప్నకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పాప కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించి ఆమె తల్లికి అప్పగించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ తెలిపారు.