ముంబై, ఏప్రిల్ 1: గత నెల 30న బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో స్వీడన్ దేశస్థుడు ఎరిక్ జొనాస్(63) ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి కథనం ప్రకారం భోజనం చేసిన తర్వాత, డబ్బులు చెల్లించేందుకు బాధితురాలు పీఓఎస్ యంత్రాన్ని అందించింది. కార్డు స్వైప్ చేసే సమయంలో నిందితుడు బాధితురాలి చేయి పట్టుకొన్నాడు. చేయి విడిచి పిన్ నమోదు చేయాలని బాధితురాలు కోరగా, నిందితుడు పైకి లేచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఒకానొక దశలో విమాన సిబ్బంది ఒకరు ఎరుపు హెచ్చరిక కార్డు చూపించి కెప్టెన్ను అప్రమత్తం చేయాల్సి వచ్చింది. విమానం దిగాక నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయల్దేరిన కార్గో విమానాన్ని పక్షి ఢీ కొనడంతో విమానం ముందు భాగంలోని విండ్ షీల్డ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వెంటనే అత్యవసర పరిస్థితి ప్రకటించి విమానాన్ని మళ్లీ ఢిల్లీ విమానాశ్రయంలో దించి భద్రత తనిఖీలు చేశారు. దాదాపు 3 గంటల తర్వాత ఆ విమానం దుబాయ్ బయల్దేరింది.