ముంబై: తల్లి పుట్టిన రోజు వేడుక కోసం విదేశాల నుంచి వచ్చిన ఎన్నారై వ్యాపారి విలాసవంతమైన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ వ్యాపారి సైరస్ ఇంజనీర్ కుమారుడైన 58 ఏళ్ల షారుఖ్ ఇంజనీర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో వ్యాపారం చేస్తున్నాడు. ఎనిమిది పదుల వయసులో ఉన్న తల్లి పుట్టిన రోజు వేడుక కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముంబైకి వచ్చాడు. కోలాబాలోని విలాసవంతమైన తాజ్ వెల్లింగ్టన్ మ్యూస్లో నివసిస్తున్న తల్లిదండ్రులను శనివారం సాయంత్రం కలిశాడు. అనంతరం పదో అంతస్తులోని తనకు చెందిన 1005 గదికి వెళ్లాడు. కొంత మంది చూస్తుండగా అక్కడి బాల్కానీ నుంచి కిందకు దూకాడు. బాంబే హాస్పిటల్కు తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, మృతుడు షారుఖ్ ఇంజనీర్ యూఏఈలో చేస్తున్న వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎన్నారై వ్యాపారి తల్లిదండ్రులు, కుటుంబం కూడా ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని వెల్లడించారు.