Air India | ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత శంకర్ మిశ్రాని అమెరికా కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత్ వైస్ ప్రెసిడెంట్గా శంకర్ మిశ్రా పని చేస్తున్నాడు. అయితే మహిళా ప్రయాణికురాలిపై అతడు మూత్ర విసర్జన చేసిన విషయం ఆ సంస్థకు తెలిసింది. దీంతో ఆయనపై చర్యలు చేపట్టింది. శంకర్ మిశ్రాను తమ సంస్థ నుంచి తొలగించినట్లు పేర్కొంది.