samosas | మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ యువ వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రికి (KEM hospital) చెందిన 27 ఏళ్ల వైద్యుడు తన స్నేహితులతో కలిసి పిక్నిక్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ప్రయాణం మధ్యలో తినేందుకు స్నాక్స్ తీసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో సియోన్ ప్రాంతంలో గల ప్రముఖ హోటల్ కు ఫోన్ చేసి 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ ఇచ్చాడు. ఇందుకోసం రూ.1500 చెల్లించాలంటూ అటువైపు వారు వైద్యుడికి సూచించారు. ఈ మేరకు ఓ నంబర్ పంపారు. వారు చెప్పిన నంబర్ కు వైద్యుడు రూ.1500 ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం కొద్దిసేపటికే వైద్యుడికి తిరిగి ఫోన్ వచ్చింది. తమకు పేమెంట్ అందలేదని.. మరో నంబర్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని వేరే నంబర్ ఇచ్చారు. దాంతో పాటు పేమెంట్ రిక్వెస్ట్ లింక్ కూడా పంపారు. వారు చెప్పింది నమ్మిన వైద్యుడు ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేశాడు.
అంతే ఇంకే ముంది కొద్దిసేపటి తర్వాత వైద్యుడి ఖతా నుంచి రూ.28,807 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇది చూసిన వైద్యుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లుగా వెంట వెంటనే మరో మూడు మెసేజ్ లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సదరు వైద్యుడు బ్యాంకుకు ఫోన్ చేసి అకౌంట్ బ్లాక్ చేయించాడు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. వైద్యుడి ఖాతాలోని రూ.1.40 లక్షలు మోసగాళ్లు స్వాహా చేసేశారు.
అనంతరం తనకు జరిగిన మోసంపై భోయివాడ (Bhoiwada) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
Also Read..
Lawrence Bishnoi | అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్
Zomato | జొమాటో నిర్వాకం.. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది
MS Dhoni | తనను సీఎస్కే జట్టులోకి తీసుకోండి అని కోరిన నటుడు.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..?